New Aarogyasri Digital Cards: ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే వైద్యారోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీతో పాటు పదోన్నతులపై కూడా ఆదేశాలు ఇచ్చింది. ఇదిలా ఉంటే... ఆరోగ్య శ్రీ పథకానికి సంబంధించి కొత్త కార్డులు మంజూరు చేసేందుకు సిద్ధమవుతోంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆరోగ్యశ్రీ సేవల పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచిన నేపథ్యంలో కొత్త కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించినట్టు వైద్యారోగ్య మంత్రి హరీశ్రావు వెల్లడించారు. డిజిటల్ కార్డుల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు.
నిర్ణయాలివే:
కొత్త ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డులను రూపొందించి, స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా జిల్లాల్లోని లబ్ధిదారులకు అందించాలని నిర్ణయం.
లబ్ధిదారుల e KYC ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు.
కొవిడ్ సమయంలో ఎక్కడా చేయని విధంగా రికార్డు స్థాయిలో 856 బ్లాక్ ఫంగస్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించి, ప్రజల ప్రాణాలు కాపాడిన కోఠి ఈఎన్టీ ఆసుపత్రికి రూ. కోటి 30 లక్షల అదనపు ప్రోత్సాహకం ఇవ్వాలని నిర్ణయం.
మూగ, చెవిటి పిల్లలకు చికిత్స అందించి బాగు చేసే కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు ప్రస్తుతం కోఠి ఈఎన్టీ ఆసుపత్రిలో ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఈ తరహా సేవలు త్వరలోనే MGM వరంగల్ లో కూడా అందుబాటులోకి తెచ్చేందుకు కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం.